Home >>> వైరల్ > పురుగులు పట్టకుండా బియ్యం నిల్వ చేయటం ఎలా........
కొన్ని నిత్యావసరాలు రోజూ లేదా వారానికి ఒకసారి తీసుకుంటాము. బియ్యం మాత్రం ఎక్కువ రోజులు ఉండేలా తీసుకుంటాము. బియ్యం కొన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ వాటిని జాగ్రత్తగా నిల్వ చేయటానికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. బియ్యం పురుగు పట్టినప్పుడు శుభ్రం చేయడానికి చాలా కష్ట పడాల్సిందే. పల్లెటూళ్లలో ఉండేవారు, గృహిణులు చేటతో చెరిగి, ఎండలో ఆరబెట్టి బియ్యానికి పట్టిన పురుగులను బాగుచేసుకుంటారు.కానీ నేటి హడావిడి కాలంలో వృత్తి, ఉద్యోగాలతో విధుల్లో బిజీగా ఉండే అమ్మాయిలకు పట్టణవాసులకు అంత తీరిక ఉండదు. కనుక బియ్యం పురుగు పట్టకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
బియ్యంలో పురుగులు పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందామా. ...
# బియ్యం నిల్వ ఉంచిన ప్రదేశం పొడిగా ఉంచుకోవాలి.
# తడి చేతులతో బియ్యం డబ్బాను త్రాకకూడదు.
# బియ్యంలో పురుగులు పెరగడానికి తేమ ముఖ్య కారణం. సాధారణంగా రెండు, మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు బియ్యంలో తేమ చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా పురుగులు పట్టచ్చు. అందుకే బియ్యంలో తడి చేరకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బియ్యంలో పురుగులు పట్టకుండా బియ్యంలో కొద్దిగా బోరిక్ పౌడర్ని కలపాలి. బోరిక్ పౌడర్ బియ్యంలో చేరిన తేమను పీల్చేసుకుంటుంది. అందువల్ల బోరిక్ పౌడర్ కలిపిన బియ్యంలో త్వరగా పురుగులు చేరవు.
# బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువమంది వేపాకులనే ఉపయోగిస్తారు. దీనిలో ఉండే క్రిమిసంహారక లక్షణం వల్ల బియ్యంలో పురుగులు చేరకుండా ఉంటాయి. వేప ఆకులను కలపకుండా కొన్ని వేపాకులను తీసుకొని ఎండబెట్టి మెత్తని పొడిగా చేసుకోవాలి.ఆ పొడిని పలుచని గుడ్డలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో తెల్లపురుగులతో పాటు పెంకు పురుగులు కూడా చేరకుండా ఉంటాయి.
# వంటల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడుతుంది. దీనికి కారణం ఇది వెదజల్లే ఘాటైన వాసనే. దీన్ని కొద్దిగా తీసుకొని బియ్యంలో కలిపితే సరిపోతుంది. దీని నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల ఇది బియ్యంలో పురుగులతో పాటు, తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తుంది.
# బియ్యంలో బిర్యానీ ఆకులను కలిపినా మంచి ఫలితం ఉంటుంది. బియ్యంలో పురుగులు దరి చేరవు.
# కర్పూరం వాడితే బియ్యంలో పురుగులు పట్టవు. కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసన వల్ల బియ్యంలో పురుగులు పెరగవు. పది కర్పూరం బిళ్లలను తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని కాస్త మందంగా ఉండే నూలు వస్త్రంలో చుట్టి బియ్యం డబ్బాలో పురుగులు చేరవు.
# ఇన్సులేటెడ్ వస్తువులు, సూట్కేస్లు, కొన్ని రకాల మెడిసిన్ ప్యాకెట్లలో సిలికా జెల్తో నిండిన చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి. వీటినే డెసికాంట్ ప్యాకెట్లు అంటారు. ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి. వీటిని బియ్యం నిల్వ చేసిన డబ్బాలో పెడితే తేమను పీల్చేసుకుంటాయి. ఫలితంగా బియ్యం పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.