వైరల్ కోసం చచ్చేలా ఉన్నారు కదరా...!

Home >>> వైరల్ > వైరల్ కోసం చచ్చేలా ఉన్నారు కదరా...!

news-details

సినిమా హీరోలకు, హీరోయిన్‌లకు, నటులకు ఫ్యాన్స్ ఉండటం సర్వ సాధారణం. వీరంతా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎన్నో కష్టం చేస్తే తప్ప.. గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు. కానీ మొబైల్ పుణ్యమా అని ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఒక సెలబ్రెటీ అయిపోతున్నారు. ఇంట్లో కూర్చుని రీల్స్ చూసే వాళ్లు కాస్త... అదే రీల్స వల్ల ఫేమస్ అయిపోతున్నారు. కొందరు చిట్కాలు చెప్పి... మరి కొందరు కుకింగ్ వీడియోలు, ఇంకొందరు డ్యాన్సులు, డబ్ స్మాష్... ఇలా ఎవరికి వారు వాళ్ల వాళ్ల టాలెంట్‌ చూపించుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఒవర్ నైట్ ఫైమస్ అవ్వడం కోసం చేసే పిచ్చిపనులు చివరికి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

ఇన్ స్టా, సోషల్ మీడియాలో ఫేమస్ కోసం ఒక్కొక్కరు ఒక్కోలా తయారవుతున్నారు. మండుటెండలో రోడ్డు మీద చెప్పులు లేకుండా నడవటం, జోరు వర్షంలో నడి రోడ్డు మీద డ్యాన్సులు... చివరికి చెరువుల్లోకి, కాలవల్లోకి దిగి పిచ్చి పిచ్చి వీడియోలు చేసేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియోలో ఫేమస్ కోసం కొందరు ఎంచుకుంటున్న మార్గం మాత్రం ప్రాణాల మీదకు తెస్తోంది. ఓ యువ జంట... ఓ పాత భవనం మీదకు ఎక్కి.... 8వ అంతస్తు పై నుంచి ఆ యువతి కిందకి వేలాడుతుంటే... యువకుడు ఒంటిచేత్తో పట్టుకున్నాడు. కింద ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. పొరపాటున అతని చెయ్యి జారితే మాత్రం... ఆ యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇక తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. రద్దీగా ఉన్న రోడ్డు మీదకు నిదానంగా వచ్చిన యువకుడు... బస్సు ముందు రోడ్డుపై పడుకున్నాడు. బస్సు వెళ్లిన తర్వాత అతను లేచి వెళ్లిపోయాడు. ఈ వీడియోలో యువకుడికి ఏం కాలేదు. ఈ ఘటనలో యువకుడి ప్రాణాలు పోతే... అంతా బస్సు డ్రైవర్‌ను తప్పుబడతారు కదా... పోనీ బస్సు వెనుక ఏదైనా కారు లేదా ఆటో వస్తే... అతని మీదకు ఎక్కేది కదా.. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అది గ్రాఫిక్స్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. 

ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్లు చేయించే పనులు కొందరు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. హైదరాబాద్‌లో ఓ జంట ఆర్టీసీ సిటీ బస్సులోనే ఫోటో షూట్ కోసం ఫోజులు ఇచ్చింది. రన్నింగ్ బస్సులో నుంచి దిగడం... బస్సు నడుస్తున్న సమయంలో కిటికీలో నుంచి యువతి వెనక్కి తిరిగి చూస్తుండగా... అబ్బాయి వెనక డోర్ నుంచి యువతిని పిలుస్తున్నట్లుగా... ఫోజులిచ్చారు. ఇక విశాఖలోని రామా టాకీస్ దగ్గరున్న అండర్ పాస్ వంతెన వద్ద నడి రోడ్డుపైన పెళ్లికూతురుతో ఫోటోలకు ఫోజులిప్పించారు. అత్యంత రద్దీగా ఉండే మార్గంలో ఇలాంటి పిచ్చిపనులేమిటని అంతా తిట్టిపోస్తున్నారు కూడా. ఏది ఏమైనా సరే... సోషల్ మీడియాలో వైరల్ కోసం... ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు నేటి యువత. ప్రాణాల కంటే.... మరేదీ ముఖ్యం కాదనేది ఎప్పుడు తెలుసుకుంటారో.

You can share this post!