Home >>> సినిమా > Balagam : రూపాయి తీసుకోకుండా ఇల్లు ఇస్తే.. కనీసం వేణు థ్యాంక్స్ కూడా చెప్పలేదు..!
ప్రస్తుతం ఎక్కడా చూసిన బలగం చిత్రం మేనియానే కనిపిస్తోంది. సిటీలోనే కాదు.. గ్రామాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో రన్ కొనసాగుతుండగానే బలగం చిత్రాన్ని ఓటీటీలలో విడుదల చేశారు. మరోవైపు గ్రామాల్లో కూడా బలగం చిత్రాన్ని పెద్ద స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇన్ని రోజులు కమెడియన్ గా బుల్లితెరపై అలరించిన వేణు యెల్దండి మొదటిసారి మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది.
కుటుంబంలోని బంధాలు, అప్యాయతలను తెలియజేస్తూ.. చావు చుట్టూ అల్లిన కథ ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ మదని తాకుతుంది. ఈ చిత్రాన్ని పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే తీసుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో కూడా జరిగింది. ఇప్పుడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం.. లొకేషన్స్ జరిగిన ప్రాంతాలు కూడా తెగ పాపులర్ అయ్యాయి. ఈ చిత్రంలోని మెయిన్ ఇల్లు అదే హీరో హౌస్ చాలా ఫేమస్ అయింది. ఆ ఇల్లు కోనరావు పేట మండలం కోలనూరు గ్రామంలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఇంటి యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. “బలగం సినిమా దర్శకుడు వేణుది మా ఊరే. దిల్ రాజు సినిమా ఛాన్స్ ఇచ్చారు. సాయం చేయమని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. దాదాపు నెలన్నర రోజుల వరకు ఈ ఇంట్లో షూటింగ్ చేస్తే మేము వేరే ఇంట్లో ఉన్నాం. డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ నేను వేణు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
ఈ సినిమా ఊహించనంత పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో మా ఇల్లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ చాలా రోజులు జరిగింది. కానీ ఇక్కడికి ఏ రోజు కూడా దిల్ రాజు రాలేదు. ఆయన కూతురు, కొడుకు మాత్రమే వచ్చేవారు. సినిమా సక్సెస్ అయిన తరువాత వేణు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నా నెంబర్ ఆయన వద్ద ఉంది. కానీ ఫోన్ చేయలేదు. మేము గుర్తుకు రాలేదు. ఆయన వద్ద నుంచి ఇవి ఏమి నేను ఆశించడం లేదు. కానీ సినిమా కోసం ఇష్టపడి ఇల్లు ఇచ్చాను అని, ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవడం లేదు” అని చెప్పుకొచ్చారు రవీంద్రరావు. వేణు యెల్దండి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 03న విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 50 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.